Prabhas: చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది.. ప్రభాస్‌తో ఎన్నికల ప్రచారం చేయించం!: కృష్ణంరాజు

  • ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు తప్పించుకోలేరు
  • ప్రభాస్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు
  • అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాపం పండే రోజు మరెంతో దూరంలో లేదని టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. విజయవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రతీ పనిలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నిజానికి బీజేపీతో పొత్తు వల్లే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడుతూ.. దానికి ఇంకా సమయం ఉందన్నారు. ప్రభాస్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి ప్రభాస్‌ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు.

More Telugu News