Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా

  • జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కలత?
  • రాజీనామాను తక్షణమే ఆమోదించాలని చంద్రబాబుకు లేఖ
  • నాలుగేళ్లుగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన రాజీనామా లేఖను పంపుతూ, తక్షణమే ఆమోదించాలని కోరారు. తనపై కొన్ని రోజులుగా కొందరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన భార్య నిర్మలా సీతారామన్‌ కేంద్ర మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిన్న జగన్‌ తన పాదయాత్రలో మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తూ బీజేపీని తిడతారని.. మరోపక్క కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు పరకాల పేర్కొన్నట్లు సమాచారం. పరకాల ప్రభాకర్‌ నాలుగేళ్లుగా ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తూ నవ్యాంధ్ర పునర్‌నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నారు. 

More Telugu News