Pranab Mukherjee: ప్రణబ్ జీ! ఆర్ఎస్ఎస్ తప్పులేంటో వాళ్లకు చెప్పినందుకు సంతోషంగా ఉంది: చిదంబరం

  • నిన్న ప్రణబ్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతల ప్రశంసలు
  • ‘కాంగ్రెస్’ సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ కు ప్రణబ్ తెలియజేశారు
  • అలాగే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కొన్ని తప్పని చెప్పారు

నిన్న నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన తృతీయ వర్ష్ వర్గ్ సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రణబ్ ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏంటో ఆర్ఎస్ఎస్ కు ప్రణబ్ తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందని, అలాగే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కొన్ని తప్పని తన దైన శైలిలో చెప్పారంటూ ఓ ట్వీట్ చేశారు. 

తన విజ్ఞప్తిని మన్నించి ఆర్ఎస్ఎస్ తప్పులేంటో వాళ్లకు ప్రణబ్ చెప్పినందుకు సంతోషంగా ఉందని చిదంబరం పేర్కొన్నారు. కాగా, ‘మీరు వెళ్లి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాల్లో ఉన్న తప్పేంటో వాళ్లకి చెప్పండి’ అని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రణబ్ నిర్ణయించుకున్న సమయంలో ఆయనకు చిదంబరం విజ్ఞప్తి చేశారు.

ఇంకా, ప్రణబ్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నాయకుల్లో ఆనంద్ శర్మ, రణ్ దీప్ సుర్జేవాలా కూడా ఉన్నారు. ప్రణబ్ తన ప్రసంగం ద్వారా చేసిన సలహా మేరకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయా? అని సుర్జేవాలా ప్రశ్నించడం గమనార్హం.

More Telugu News