Andhra Pradesh: కిడ్నీ బాధితులకు అందిస్తున్న సేవలపై ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

  • ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యం 
  • ఒక్కో రోగికి రూ.లక్షా 70 వేల డయాలసిస్ సేవలు ఉచితం
  • ఉద్దానంలో రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లు
  • మరో 14 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు

కిడ్నీ బాధితులకు అందిస్తున్న సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్ ను యథాతథంగా ప్రచురిస్తున్నాం...

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం పాలన సాగుతోంది. ముఖ్యంగా ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆరోగ్య పథకాలను అమలు చేస్తోంది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’, ‘ఎన్టీఆర్ వైద్య పరీక్ష’, ‘అన్న సంజీవని’, ‘చంద్రన్న సంచార చికిత్స’, ‘ఈ ఔషధి’, ‘ఈ యూపీహెచ్ సి’, ‘మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ (ఎంఎంహెచ్ సి)’, 108, 102 వంటి ఆరోగ్య పథకాలతో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తోంది. పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ ఉచిత డయాలసిస్ సేవల పథకాన్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది.

ప్రస్తుత సమాజంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో పేదలే అధికంగా ఉంటున్నారు. కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆర్థికంగా ఎంతో ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో, పేదరికంతో బాధపడుతున్న కిడ్నీ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కిడ్నీ రోగుల ప్రాణాలకు భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది.

పేదల బతుకుల్లో వెలుగులు నింపే ధ్యేయంతో ఉచిత డయాలసిస్ సేవల పథకాన్ని 2016 లో ప్రారంభించింది. దీని ద్వారా కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు, పింఛన్లు, సురక్షితమైన తాగునీటిని, మందులను అందజేస్తోంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గురువారం సాయంత్రం (7.6.2018) నాటికి వరకూ 2,666 రోగులకు 1,81,473 డయాలసిస్ సెషన్లు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ల నిర్వహణతోనే ప్రభుత్వం సరిపెట్టడంలేదు. ‘ఉద్ధానం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఉచిత కిడ్నీరోగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం 15 మొబైల్ మెడికల్ క్లినిక్ లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

మరో 14 డయాలసిస్ కేంద్రాలు 

దేశంలోనే మొదటిసారి ఉచిత డయాలసిస్ సేవలను నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద ఈ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 18 డయాలసిస్ సెంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  కొత్తగా మరో 14 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చీరాల, గూడూరు, హిందూపూర్, కందుకూరు, కనిగిరి, మచిలీపట్నం, మర్కాపుర్, నంద్యాల, నర్సీపట్నం, పాలకొండ, పలాస, పార్వతీపురం, ప్రొద్దుటూరు, రాజమండ్రి, సోంపేట, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, తెనాలి ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు పని చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే 14 కేంద్రాలను పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావు పేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోనిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లు

కిడ్నీ బాధితులకు ప్రభుత్వం సురక్షితమైన నీటిని అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్దానంలోని పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందస మండలాల్లో రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా చేస్తోంది. 136 రిమోట్ డిస్పె న్సింగ్ యూనిట్లకు గానూ ఇప్పటికే 109 యూనిట్లను ఏర్పాటు చేసింది. మరో 27 యూనిట్లు త్వరలో పూర్తి చేయనుంది.

నెలకు రూ.లక్షా 70 వేల డయాలసిస్ సేవలు ఉచితంగా

ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. ఒక పర్యాయానికే రూ.2000 నుంచి రూ.3000 వరకూ వసూలు చేస్తుంటారు. కొందరికి రెండ్రోజులకొకసారి, మరికొందరికి వారానికి రెండు పర్యాయాలు డయాలసిస్ అవసరమవుతుంది. ఇలా నెలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటే లక్షా 70 వేల రూపాయల వరకూ వ్యయమవుతుంది. ఇది పేదలకు పెను ఆర్థిక భారమే. పేదల ప్రాణాలకు భరోసానిస్తూ, ప్రభుత్వమే డయాలసిస్ సేవలను ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల తమకు ఆర్థిక భారం నుంచి తప్పించడమే కాకుండా భవిష్యత్తుపై భరోసా కలుగుతోందని బడుగు జీవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశం తమకు పునర్జన్మ వంటిదని ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానాన్నిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలో విశాఖపట్నంలోని విమ్స్ లో ఐ.సి.ఎం.ఆర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

బాధితులందరికీ రూ.2,500 పెన్షన్

రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభమైనా, కిడ్నీ రోగులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం రూ.లక్షల విలువైన వైద్య సేవలతోనే సరిపెట్టకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించేలా పెన్షన్లు కూడా అందిస్తోంది. ఒక్కో రోగికి నెలకు రూ.2,500 చొప్పున పింఛన్ అందజేస్తోంది. 

More Telugu News