Karnataka: దేవెగౌడ జీ..అభినందనలు: సీఎం మమతా బెనర్జీ
![](https://img.ap7am.com/bimg/tnews-b50f6a2ef5cd1bc9edfd1b91c80b20a1e95d4840.jpg)
- ప్రజాస్వామ్యం గెలిచింది
- రీజనల్ ఫ్రంట్ సాధించిన విజయం ఇది
- కర్ణాటక ప్రజలకు అభినందనలు
బలపరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తనకు లభించకపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా ప్రకటించారు. తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు. దేవెగౌడ జీ, కుమారస్వామి జీ, కాంగ్రెస్, ఇతరులకు అభినందనలు. రీజనల్ ఫ్రంట్ సాధించిన విజయం ఇది’ అని మమత తన ట్వీట్ లో పేర్కొంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం కూడా తన సంతోషం వ్యక్తం చేశారు. ‘అయ్యో! మిస్టర్ యడ్యూరప్ప. ఎప్పుడైతే కీలుబొమ్మలనాడించే వారు విఫలమవుతారో, అప్పుడు ఆ కీలు బొమ్మ కింద పడి పగిలిపోతుంది’ అని బీజేపీని విమర్శిస్తూ ఈ ట్వీట్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘పిరికితనం, అవినీతి, అబద్ధాలతో పాటు అపవిత్ర రాజకీయాలకు పాల్పడిన వారిపై ఎట్టకేలకు ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు!’ అని సంతోషం వ్యక్తం చేసింది.