sudheer babu: సొంతంగా డబ్బింగ్ చెప్పేసుకున్న మరో హీరోయిన్

  • ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'
  • కథానాయికగా అదితీరావు హైదరీ 
  • జూన్ 15వ తేదీన విడుదల  

కొంతకాలం క్రితం వరకూ తెలుగులో నటించే ఇతర భాషల కథానాయికలకు తప్పనిసరిగా వేరేవారితో డబ్బింగ్ చెప్పించవలసి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భాష తెలిస్తేనే భావాలను స్పష్టంగా పలికించగలమనీ, భాషపై పట్టు వున్న కథానాయికలు ఎక్కువకాలం పాటు ఈ రంగంలో మనుగడను కొనసాగించగలుగుతారని కథానాయికలు భావిస్తున్నారు. ఈ కారణంగా తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు రాగానే తెలుగు భాషను నేర్చుకోవడానికీ .. తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

సమంత .. రకుల్ .. రాశీ ఖన్నా .. తెలుగు భాషను నేర్చుకుని, డైరెక్టర్ ఒప్పేసుకుంటే చాలు తమ పాత్రకి డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఇటీవల 'ఫిదా' సినిమా కోసం సాయిపల్లవి తెలంగాణ యాస నేర్చుకుని డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ జాబితాలో అదితీరావు హైదరీ కూడా చేరిపోయింది. 'సమ్మోహనం' సినిమా కోసం ఆమె తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 15వ తేదీన విడుదల కానుంది.     

More Telugu News