Tirumala: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, లక్కీ డ్రా వివరాలు!

  • 58,419 టికెట్లను విడుదల చేసిన టీటీడీ
  • ఎలక్ట్రానిక్ లాటరీ కింద 9,619 టికెట్లు
  • సాధారణ బుకింగ్ కింద 48,800 టికెట్లు

జూలై నెల తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేశారు. మొత్తం 58,419 టికెట్లను ఆన్ లైన్ లో లక్కీ డ్రా, సాధారణ బుకింగ్ విధానంలో భక్తులకు అందుబాటులో ఉంచినట్టు టీటీడీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ లాటరీ కింద 9,619 సేవా టికెట్లను ఉంచామని, వీటిల్లో సుప్రభాతం 6,979, తోమాల సేవ 110, అర్చన 110, అష్టదళ పాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉంటాయని తెలిపారు.

వీటిని పొందగోరే భక్తులు నేటి నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకూ టీటీడీ అధీకృత వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ విజేతలను ఎంపిక చేసి, వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ విధానాల్లో సమాచారాన్ని అందిస్తామని, ఆపై వారు మూడు రోజుల్లోగా ఎంపికైన సేవకు డబ్బు చెల్లించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.

ఇక కరెంట్ బుకింగ్ కింద 48,800 టికెట్లను అందుబాటులో ఉంచామని, వీటిల్లో విశేషపూజ 1000, కల్యాణోత్సవం 12,350, డోలోత్సవం 3,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,150, వసంతోత్సవం 8,800, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 టికెట్లను సాధారణ విధానంలో ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.

More Telugu News