Cricket: హీరో అయ్యే అవకాశం కోల్పోయాను... ఈ జ్ఞాపకం పోవాలంటే గొప్పగా ఆడాలి: టీమిండియా ఆల్‌ రౌండర్‌ విజయ్ శంకర్

  • బంగ్లాతో ఫైనల్ రోజు నాకు దుర్దినం
  • చేదు జ్ఞాపకాన్ని మర్చిపోలేను
  • అలా ఆడడం కంటే డకౌట్ అయినా బాగుండేది

పేలవమైన ఆటతీరుతో ‘హీరో’ అయ్యే అవకాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నానని టీమిండియా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాతో ఆడిన ఫైనల్ మ్యాచ్ రోజు తనకు దుర్దినమని పేర్కన్నాడు. ఈ అనుభవాన్ని మర్చిపోవడం కూడా కష్టంగానే ఉందని తెలిపాడు. మళ్లీ అలాంటి ఫైనల్లో రాణిస్తే తప్ప ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోలేనని అభిప్రాయపడ్డాడు. విమర్శలను స్వీకరించాల్సిందేనని చెప్పాడు. తాను బాగా ఎదిగేందుకు అవి సహకరిస్తాయని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. నిజానికి ఆ పరిస్థితుల్లో తానలా ఆడడం కంటే డకౌట్ అయినా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో తాను డాట్ బాల్స్ ఆడలేదని, స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధించానని విజయ్ శంకర్ తెలిపాడు. దినేష్ కార్తీక్ ధాటిగా ఆడడంతో విజయం సాధించినప్పటికీ, ఓటమిపాలై ఉంటే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని శంకర్ వాపోయాడు. కాగా, నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో స్పెషలిస్టు కీపర్, బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ కంటే ముందే క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ భారీ షాట్లు ఆడాలన్న ఆలోచనతో డాట్ బాల్స్ ఆడాడు. దీంతో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో కేవలం 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దినేశ్‌ కార్తీక్‌ వీరోచిత మెరుపులతో చేజారిందనుకున్న కప్‌ చివరికి టీమిండియా వశమైన సంగతి తెలిసిందే. 

More Telugu News