koti: కీలక నిర్ణయం.. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ- మంత్రి కడియం శ్రీహరి ప్రకటన

  • సీఎం కేసీఆర్ ఆమోదంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
  • విశ్వవిద్యాలయంగా మార్చడానికి కోఠి ఉమెన్స్ కాలేజీకి అన్ని వసతులు
  • విశ్వవిద్యాలయంగా మార్చేందుకు నెల రోజుల్లో నివేదిక
  • కోఠి ఉమెన్స్ కాలేజీలో ఆకస్మిక తనిఖీ చేసి మీడియాతో చెప్పిన‌ కడియం శ్రీహ‌రి

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని రాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో నేడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులను పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యా విధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉమెన్స్ కాలేజీ పరిసరాలను, భవనాలను తిరిగి చూశారు. హైదరాబాద్ నడిబొడ్డున 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కాలేజీలో బోధనా వసతులు బాగున్నాయని, కాలేజీ వాతావరణం విద్యార్థులకు అనుగుణంగా ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కాలేజీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులున్నారని, వీరితో పాటు విదేశాలకు చెందిన చాలా మంది విద్యార్థులు కూడా చదువుతున్నారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకటి ఉండగా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిందన్నారు. దీంతో తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇందుకు తగిన సాయం చేయాలని కోరినట్లు కడియం శ్రీహరి వివరించారు.

మొత్తం 42 యూజీ, పీజీ కోర్సులు..

ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీని చూసిన తర్వాత తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా దీనిని మార్చడానికి కావల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని గుర్తించామన్నారు. ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి కావల్సిన మౌలిక వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీలో మొత్తం 42 యూజీ, పీజీ కోర్సులు నడుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఒక్క పరిశోధన మాత్రమే లేదని, విశ్వవిద్యాలయంగా మారితే పరిశోధన కూడా ప్రారంభం అవుతుందన్నారు.

ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 200 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఆయా భవనాల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత కావల్సిన ఇతర వసతులు కూడా కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనిఖీలో ఆయనతో పాటుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రశాంత్ ఆత్మ, కాలేజీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

More Telugu News