KKR: గంభీర్ ని పక్కనబెట్టడంపై అభిమానుల ఆగ్రహం.. వివరణ ఇచ్చిన కేకేఆర్ జట్టు!

  • కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా రెండు సార్లు ట్రోఫీ అందించిన గౌతమ్ గంభీర్
  • గంభీర్ ను ఎందుకు వదులుకున్నారంటూ యాజమాన్యంపై విరుచుకుపడ్డ అభిమానులు
  • తనే వద్దన్నాడన్న కేకేఆర్ జట్టు సీఈవో

ఐపీఎల్ లో రెండు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ ని వదులుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. కేకేఆర్ జట్టు యాజమాన్యం గంభీర్ ను అట్టిపెట్టుకోలేదు. పోనీ కనీసం వేలంలో కూడా ఎందుకు సొంతం చేసుకోలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఆ జట్టు యాజమాన్యాన్ని అభిమానులు ప్రశ్నించారు. ఎందుకిలా చేయాల్సి వచ్చింది? అంటూ నిలదీశారు.

దీనిపై ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్ స్పందిస్తూ, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ పై తమకు నమ్మకం ఉందన్నారు. ఆయనను జట్టుతో పాటే ఉంచుకోవాలని ముందుగానే ప్లాన్ చేశామని, కానీ గంభీరే వేలంలో తనపై ఆసక్తి చూపొద్దని, కనీసం ఆర్టీఎం (రైట్ టూ మ్యాచ్) లో కూడా తనపై ఆసక్తి చూపొద్దని సూటిగా చెప్పాడని ఆయన అన్నారు. గంభీర్ ప్లాన్స్ ఏంటో తమకు తెలియదని, అందువల్లే గౌతీకి తాము ఏ విధంగానూ సాయం చేయలేకపోయామని చెప్పారు. అంతేకాకుండా.. 'సారీ గంభీర్' అని కూడా అన్నారు.

కాగా, గంభీర్‌ ని 2.8 కోట్ల రూపాయలకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు దక్కించుకుంది. హోం జట్టు కొనుగోలు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశాడు. 

More Telugu News