Chandrababu: 'మా దేవుడు చంద్రబాబుకు గుడి కట్టిస్తా'మంటున్న హిజ్రాలు!

  • హిజ్రాల వెల్ఫేర్ బోర్డును ప్రకటించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు
  • నంద్యాల - మహానంది మార్గంలో ఆయనకు గుడి కట్టిస్తాం
  • పది కిలోల వెండి విగ్రహం తయారు చేయిస్తున్నాం
  • హిజ్రాల సంఘం నాయకుడు విజయ్ కుమార్

ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి పనిని సీఎం చంద్రబాబునాయుడు చేశారని హిజ్రాల సంఘం నాయకుడు విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిజ్రాల కోసం ఓ వెల్ఫేర్ బోర్డును ప్రకటించిన చంద్రబాబు, హిజ్రాల గుండె గుడిలో ఆయన దేవుడిగా ఉన్నారని ప్రశంసించారు. ఇందుకు కృతజ్ఞతగా చంద్రబాబుకు ఓ దేవాలయం నిర్మించి, అందులో ఆయన వెండి విగ్రహాన్ని ఉంచుతామని అన్నారు. నంద్యాల నుంచి మహానంది వెళ్లే మార్గంలో ఈ గుడి నిర్మించేందుకు ఇప్పటికే స్థలం సేకరించామని, ఫిబ్రవరిలో భూమి పూజ చేస్తామని చెప్పారు.

చాలా మంది దాతలు ముందుకొస్తున్నారని, ‘అభిరుచి’ మధు రూ.5 లక్షల రూపాయలతో పది కిలోల వెండి విగ్రహాన్నితయారు చేయిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను సాయం చేయమని కోరతామని, ఒకవేళ, వాళ్లు ముందుకు రాకపోతే, తన అరఎకరం భూమిని అమ్మేసి అయినా సరే, చంద్రబాబుకు గుడి కట్టించి తీరతామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆధార్, ఓటు, రేషన్, పెన్షన్ వంటి సౌకర్యాలను ఆయన కల్పించారని అన్నారు. తమలో కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారని, భిక్షాటనే కాకుండా తాము కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతుకుతామని, ‘మా దేవుడు చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి’ అని సంతోషం వ్యక్తం చేశారు. ‘మీకు కూడా తెలివితేటలు ఉన్నాయి. అందరితో సమానం. అందరితో పాటు ఏ పనైనా మీరు చేయగలరు అనే గుర్తింపును’ మాకు తీసుకువచ్చిన చంద్రబాబునాయుడుకి గుడి కట్టించి నిత్యం పూజలు చేసుకుంటామని, హిజ్రాలందరూ చంద్రబాబుకు రుణపడి ఉంటారని అన్నారు.

More Telugu News