Telangana: మావి అబద్ధాలైతే నా ముక్కు నేలకు రాస్తా.. రేవంత్ రెడ్డివి అబద్ధాలైతే అందుకు సిద్ధమేనా?: బాల్క సుమన్

  • విద్యుత్ పై బహిరంగ చర్చకు రావాలి
  • రేవంత్ కు సవాల్ విసురుతున్నా
  • రేవంత్ చెప్పేది అబద్ధమైతే అబిడ్స్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్

విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశమై బహిరంగ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలతో కలిసి చర్చకు వచ్చినా తనకు అభ్యంతరం లేదని, చర్చకు సమయం, స్థలం రేవంత్ నిర్ణయించినా ఓకే అని అన్నారు.

విద్యుత్ పై రేవంత్ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని నిరూపిస్తానని అన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి మేము చెప్పేవి అబద్ధాలైతే తన ముక్కు నేలకు రాస్తానని, అదే, రేవంత్ చెప్పేది అబద్ధమైతే అబిడ్స్ చౌరస్తాలో ఆయన ముక్కు నేలకు రాయాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. 

More Telugu News