sudheer babu: టాలీవుడ్ ను విస్మయానికి గురి చేసేలా.. ఒకేసారి ఐదు సినిమాలను ప్రకటించిన సుధీర్ బాబు!

  • శమంతకమణితో ఆకట్టుకున్న సుధీర్ బాబు
  • ఐదు కొత్త సినిమాల్లో రెండు ద్విభాషా చిత్రాలు 
  • బాలీవుడ్ లో మార్కెట్ పై కన్నేసిన సుధీర్ బాబు

‘శమంతకమణి’లో నారా రోహిత్‌, ఆది, సందీప్‌ కిషన్‌ తో పాటు నటించిన సుధీర్ బాబు తాజాగా టాలీవుడ్ ఆశ్చర్యపోయే ప్రకటన చేశాడు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఐదు కొత్త సినిమా ప్రాజెక్టులు చేపట్టానని తెలిపాడు. తన 8వ చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించనుండగా, 9వ సినిమాకు రాజశేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు. దీనికి నిర్మాత సుధీరే కావడం విశేషం. ఇది తండ్రి సెంటిమెంట్ తో నిండిన ప్రేమ కథ అని సుధీర్ తెలిపాడు.

 ఇక 10 సినిమాను ‘జెంటిల్‌మెన్‌’ హిట్‌ కాంబినేషన్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణప్రసాద్‌ లతో చేయనున్నాడు. ఇందులో హైదరాబాదీ అయిన బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరి నటించనుంది. ఇది అనూహ్యమైన కథాంశమని, ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్తతరం ప్రేమకథా చిత్రమని ఇంద్రగంటి తెలిపారు. దీనిని శ్రీదేవీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీని షూటింగ్ డిసెంబరు రెండోవారంలో ప్రారంభం కానుండగా, ఏప్రిల్‌ లో విడుదల అవుతుంది.

 ఇక తన 11వ చిత్రం గురించి పెద్దగా వెల్లడించని సుధీర్ బాబు.. దాని గురించి అందరికీ తెలుసని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇది ద్విభాషా చిత్రమని క్లూ ఇచ్చాడు. దీనిని పుల్లెల గోపీచంద్ బయోపిక్ గా భావిస్తుండగా, తన 12వ సినిమా రచయిత హర్షవర్థన్‌ దర్శకత్వంలో లవ్‌ థ్రిల్లర్‌ గా రూపొందనున్నట్టు చెప్పాడు. దీని షూటింగ్ పూర్తిగా యూఎస్ లో జరుగనున్నట్టు వెల్లడించాడు. ఇది కూడా ద్విభాషా చిత్రమే కావడం విశేషం.

టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ తో కలిసి సుధీర్ బాబు 'భాగీ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన టైగర్ ష్రాఫ్ కు సుధీర్ బాబు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. కరకు విలన్ గా ఆకట్టుకున్నాడు. దీంతో హిందీలో కూడా సుధీర్ బాబుకి మార్కెట్ ఏర్పడింది.

More Telugu News