love: షాకింగ్... ప్రియుడ్ని పెళ్లాడేందుకు కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్న యువతి!

  • పెళ్లైన కొన్ని నెలలకే విభేదాలతో భర్త నుంచి విడిపోయిన యువతి
  • మరొకరి ప్రేమలో పడిన వైనం.. ప్రియుడిని పెళ్లాడేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు
  • కట్నం అడిగిన ప్రియుడు

ప్రియుడిని పెళ్లాడేందుకు కిడ్నీ అమ్మేందుకు బీహార్ యువతి సిద్ధపడడం దేశరాజధానిలో కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన యువతి (21)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. అయితే విభేదాల నేపథ్యంలో పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పెద్దలకు చెప్పింది. దానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

దీంతో అతనితో వెళ్లిపోయేందుకు కూడా సిద్ధపడింది. అయితే అబ్బాయి మాత్రం కట్నం లేనిదే వివాహం కుదరదని తెగేసి చెప్పాడు. 1.8 లక్షల రూపాయల కట్నం కావాలని డిమాండ్ చేశాడు. అతనితో వివాహానికే అంగీకరించని తల్లిదండ్రులు, కట్నం ఇచ్చే పరిస్థితి అసలే లేదని తేల్చి చెప్పేశారు.  

ఈ నేపథ్యంలో బాగా ఆలోచించిన యువతి, కిడ్నీ అమ్మడం ద్వారా డబ్బులు సమకూర్చుకుని ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఢిల్లీ చేరింది. ఒక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి, కిడ్నీ దానం చేయాలనుకుంటున్నానని తెలిపింది. కానీ అక్కడి వైద్యులకు ఆమె కిడ్నీ అమ్ముతున్నట్టు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను విచారించిన పోలీసులు జరిగిన తతంగం మొత్తం తెలుసుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రియుడిపై ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అయితే కిడ్నీ అమ్మకాన్ని విరమించుకున్న ఆమె, ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం నిరాకరించి, తిరిగి బీహార్ వెళ్లిపోయింది. 

More Telugu News