: ప్రధాని పుట్టిన రోజు మరి... ఆదివారం ప్రతి ఒక్కరూ స్కూల్ కు రావాలని ఆదేశాలిచ్చి విమర్శలు కొని తెచ్చుకున్న యోగి సర్కారు!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భావించిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వు విమర్శలు తెచ్చి పెట్టింది. ఈ నెల 17న మోదీ జన్మదినం కాగా, ఆ రోజు ఆదివారం అయింది. ఆదివారం నాడు పుట్టిన రోజు వేడుకలు అన్ని పాఠశాలల్లో జరపాలని భావించిన ప్రభుత్వం, ఆ రోజు పాఠశాలలు తెరచివుంటాయని, విద్యార్థులు విధిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.
ప్రతి ఒక్కరూ తప్పకుండా స్కూలుకు వచ్చి వేడుకల్లో పాలు పంచుకోవాలని రాష్ట్ర విద్యా మంత్రి అనుపమా జైస్వాల్ ఈ ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్రంలోని 1.60 లక్షల ప్రాథమిక పాఠశాలలు ఆదివారం పని చేయాలని తేల్చి చెప్పారు. దేశాభివృద్ధిపై మోదీ విజన్, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కలిగించేలా ప్రసంగాలుండాలని ఆమె తెలిపారు. ఈ తాజా ఉత్తర్వులపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. బలవంతంగా హిందుత్వ ఎజెండాను విద్యార్థుల్లోకి చొప్పించాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు వస్తున్నాయి.