: ఇక వారిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల నిఘా!

ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక మొత్తంలో వడ్డీ పొంది, పన్ను చెల్లించని వేలాది మందిపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఏడాదికి రూ.5 లక్షల కంటే ఎక్కువ వడ్డీ పొందుతూ పన్ను చెల్లించని సీనియర్ సిటిజన్లతో పాటు మిగతావారిపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రొఫెనల్స్ ఆదాయంపై దృష్టి పెట్టామని, వీరిలో చాలా మంది తాము సంపాదించిన మొత్తాన్ని, విలాసాలకు ఖర్చు చేస్తూ, తమ కచ్చితమైన ఆదాయాన్ని బహిర్గతం చేయడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుకు సంబంధించిన ఓ అధికారి చెప్పారు. వివిధ వనరుల ద్వారా పొందిన ఆదాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, వాటిని ఐటీ రిటర్న్స్ లో చూపడం లేదని, అటువంటి వారిని గుర్తించి చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. ఎక్కువ ఆదాయం పొందిన వారే తమ లక్ష్యమని, అల్పాదాయ వర్గాల వారు తమ లక్ష్యం కాదని ఆ అధికారి చెప్పారు.

More Telugu News