: అప్పట్లో రాజీవ్ గాంధీని అసమర్థుడిగా అంచనా వేసిన అమెరికా నిఘా సంస్థ!

టెక్నాలజీ పరంగా మన దేశ స్థితిగతులను మార్చిన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఓ అసమర్థుడిగా అమెరికా నిఘా సంస్థ సీఐఏ గతంలో అభిప్రాయపడింది. ఇందిరాగాంధీ హత్యకు సుమారు రెండేళ్ల ముందు ఇచ్చిన నివేదికలో... ఒకవేళ ఇందిర హఠాన్మరణానికి గురైతే కాంగ్రెస్ పార్టీని నడిపించగల రాజకీయ సమర్థత రాజీవ్ లో లేదని సీఐఏ పేర్కొంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ఖాయమని అభిప్రాయపడింది.

అయితే, ఊహించని విధంగా 1984 అక్టోబర్ లో ఇందిర దారుణ హత్యకు గురికావడం, ఆమె వారసత్వాన్ని రాజీవ్ కొనసాగించడం జరిగింది. మన దగ్గర 'సమాచార హక్కు'లాగే అమెరికాలో 'ఫ్రీడమ్ ఆఫ్ ఇన్షర్మేషన్' యాక్ట్ ఉంది. ఈ సదుపాయం ద్వారా సేకరించిన 'ఇండియా ఇన్ ది మిడ్ 1980స్: గోల్స్ అండ్ ఛాలెంజెస్' అనే డాక్యుమెంట్ లో ఈ విషయం వెల్లడైంది.

ఒకవేళ ఇందిర మరణం సంభవిస్తే రాజకీయ నేతగా రాజీవ్ ఎలా ఎదుగుతాడనే విషయాన్ని అంచనా వేయడం కష్టమని ఈ డాక్యుమెంట్ లో సీఐఏ తెలిపింది. వయసులో చిన్నవాడు కావడం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని పేర్కొంది. ఒకవేళ ప్రధాని పదవిని రాజీవ్ చేపట్టినా, తన తల్లిలా గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ఎదగకపోతే... అతని అధికారం స్వల్పకాలానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. పార్టీని నడిపించగలిగిన ఇతర నేతల్లో రక్షణ మంత్రి ఆర్.వెంకట్రామన్, విదేశాంగ మంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పరిశ్రమల మంత్రి ఎన్డీ తివారీలు ఉన్నారని చెప్పింది.

More Telugu News