: చంద్రబాబుకి రైతులపై ప్రేమలేదు... కాంట్రాక్టర్లపైనే ప్రేమ!: వంశధార నిర్వాసితుల సభలో జ‌గ‌న్

గ‌త ప్ర‌భుత్వంలోనే మొద‌లు పెట్టిన వంశ‌ధార ప్రాజెక్టు ప‌నులు కొద్దిగా మాత్ర‌మే మిగిలిపోయాయ‌ని, రైతుల‌పై ప్రేమ ఉన్న ఏ ముఖ్య‌మంత్రి అయినా ఆ ప‌నులు పూర్తి చేయాల‌నుకుంటే కేవ‌లం ఒక్క సంవ‌త్స‌రంలోనే పూర్తి చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ రోజు శ్రీ‌కాకుళం జిల్లాలో వంశ‌ధార నిర్వాసితుల‌తో ఆయ‌న ముఖాముఖిలో మాట్లాడుతూ... ‘మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారికి కాంట్రాక్ట‌ర్ల మీదం ఎంతో ప్రేమ ఉంది. రైతుల మీద మాత్రం ప్రేమ లేదు. కాంట్రాక్ట‌ర్లు గ‌డువు లోప‌ల ప‌నులు పూర్తి చేయ‌లేక‌పోతే వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం వారిపై ఎంతో ప్రేమ‌తో చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. టీడీపీ నేత‌ సీఎం ర‌మేశ్ కూడా కాంట్రాక్టులు ద‌క్కించుకుంటున్నారు’ అని జగన్ అన్నారు.

‘ప‌నులు పూర్తి చేయ‌క‌పోతే కాంట్రాక్ట‌ర్ల‌ను జైలుకి పంపాలి.. చంద్రబాబు నాయుడు మాత్రం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేనాటికి రాష్ట్రానికి 97 వేల కోట్ల అప్పులు ఉండేవి, కేవ‌లం మూడేళ్ల‌లో అప్పుల భారం 2ల‌క్ష‌ల 16 వేల కోట్ల రూపాయ‌ల‌కు పెరిగింది. రాష్ట్రంలో బ‌డ్జెట్ కేటాయింపులు, అప్పులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. క‌నీసం వెయ్యి కోట్ల రూపాయ‌లు కూడా వంశ‌ధార ప్రాజెక్టుకు కేటాయించ‌డం లేదు. ఎందుకంటే వెయ్యి కోట్ల రూపాయ‌లు రైతుల‌కు ఇస్తే చంద్ర‌బాబుకి ఒక్క‌పైసా కూడా క‌మీష‌న్ రాదు.. అదే వెయ్యి కోట్ల రూపాయ‌లు కాంట్రాక్ట‌ర్ల‌కి ఇస్తే 30 శాతం క‌మీష‌న్ తీసుకోవ‌చ్చు... కేవ‌లం 10 శాతం మిగిలిపోయిన వంశ‌ధార ప్రాజెక్టు ప‌నులు చంద్ర‌బాబు నాయుడు పూర్తి చేయ‌డం లేదు. మూడేళ్లుగా ఎందుకు మా బాధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చంద్ర‌బాబుకి బుద్ధొచ్చే విధంగా అడుగుదాం. టీవీల్లో రాష్ట్రంలోని ప్ర‌జానీకం చూస్తుంటారు. గట్టిగా అడ‌గండి’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.  

More Telugu News