: ఈ రోజుల్లో యుద్ధం పెద్ద దూరంలో ఏమీ లేదు... ఢీ కొట్టేందుకు మా దేశ సైన్యం సిద్ధంగా ఉంది: పాకిస్థాన్ ప్ర‌ధాని

పాకిస్థాన్ తన తీరుని మార్చుకోవడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత నేవీ మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌కు పాక్ ఆర్మీ మ‌ర‌ణ శిక్ష విధించ‌డంపై భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పాక్ మ‌రింత రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తోంది. ఈ రోజు ఈ అంశంపై పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన త‌రువాత తాజాగా ఆ దేశ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కూడా అటువంటి వ్యాఖ్య‌లే చేసి భార‌త్‌ను మ‌రింత రెచ్చ‌గొట్టారు.

ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని, ఢీకొట్టేందుకు త‌మ దేశ సైన్యం సిద్ధమ‌ని ప్రకటించారు. అంతేకాదు, ఈ రోజుల్లో యుద్ధం పెద్ద దూరంలో ఏమీ లేద‌ని అన్నారు. త‌మ దేశం శాంతియుత దేశ‌మ‌ని, అంతేగానీ పాక్ బ‌ల‌హీన దేశ‌మ‌ని అనుకోవ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. చివరకు పలు నీతి వాక్యాలు కూడా పలికారు. విభేదాలకన్నా పరస్పర సహకారంతో ఉండటమే తమ దేశ విధానమని అన్నారు. ఇతర దేశాలతో స్నేహాన్ని పెంచుకునే అంశంలో తాము ముందుంటామని చెప్పారు.

 

More Telugu News