: హాస్టళ్లలో అమ్మాయిలు దారి తప్పకుండా కఠిన ఆంక్షలు ఉండాల్సిందే: మేనకా గాంధీ

మహిళా సాధికారతపై నిత్యమూ మాట్లాడుతూ ఉండే కేంద్ర మంత్రి మేనకాగాంధీ, మహిళా దినోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు దారి తప్పకుండా 'లక్ష్మణ రేఖ' ఉండాల్సిందేనని, హాస్టళ్లలో వారిపై రాత్రుళ్లు కర్ఫ్యూ వంటి ఆంక్షలు ఉంచాలని, అది వారి రక్షణ కోసమేనని, ఇదే తరహా ఆంక్షలు అబ్బాయిలకు అవసరం లేదని ఆమె అన్నారు.

"తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపి చదివించడానికి అంగీకరించారంటే, వారి రక్షణపై నమ్మకం ఉంచినట్టే. ముఖ్యంగా 16, 17 ఏళ్ల అమ్మాయిల్లో వచ్చే శారీరక మార్పులు చాలా సవాళ్లతో కూడుకున్నవి. అందువల్ల వారి రక్షణ అత్యంత ముఖ్యం" అని మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. అమ్మాయిలు, అబ్బాయిలను వేరు చూస్తూ, ప్రతి విషయంలోనూ అవధులు ఉండాలని, రాత్రుళ్లు లైబ్రరీలకు వెళ్లే విషయంలోనూ, రెండు రోజులు కేవలం అబ్బాయిలకు, రెండు రోజులు కేవలం అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. మేనకాగాంధీ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

More Telugu News