: ఉద్యోగాలు ఊడే కాలం... వేలాది మందికి 'పింక్ స్లిప్'లు ఇస్తున్న భారత కంపెనీలు!

స్థిరమైన వృద్ధితో వేగంగా ఎదగలేక పోతున్న మధ్యతరహా సంస్థలు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పేరిట వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తొలగించాలని భావిస్తున్న వారికి 'పింక్ స్లిప్'లను జారీ చేశాయి. ఈ వేసవిలో వారంతా మరో ఉద్యోగాన్ని చూసుకోవాలని అల్టిమేట్టం జారీ చేశాయి. ఇండియాలో మూడవ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ నుంచి, సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా, ఫ్యాషన్ పోర్టల్ యప్ మీ, టోలెక్సో వంటి స్టార్టప్ కంపెనీలు ఇటీవల వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నాయి.

క్రాఫ్ట్స్ విల్లా సంస్థ తన పూర్తి ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని మూసివేస్తూ, 100 మందికి పైగా ఉద్యోగులను, ఉన్నతాధికారులను తొలగించింది. ఈ తొలగింపుపై వివరణ కోరేందుకు సంస్థ సీఈఓ మనోజ్ గుప్తాను సంప్రదించాలని చూడగా, ఆయన అందుబాటులో లేరు. కాగా, స్టార్టప్ సంస్థల్లో నిధుల లేమి, పెట్టుబడుల కొరత కూడా ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. 2015లో సుమారు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన స్టార్టప్ సంస్థలు, గత సంవత్సరం కేవలం రూ. 8,500 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ కే పరిమితం అయ్యాయి. 2015తో పోలిస్తే, ఇది దాదాపు 28 శాతం తక్కువ. దీంతో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

ఆర్థిక వ్యవస్థ మందగమనం, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ-కామర్స్, ఫుడ్ - టెక్, లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీలు దాదాపు 9 వేల మందిని తొలగించనున్నాయని రీసెర్చ్ సంస్థ 'క్సీలర్ 8' అంచనా వేసింది. తొలగించాలని భావిస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులను ఈ సంవత్సరమే తీసివేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ వజీర్ అడ్వయిజర్స్ ఎండీ హర్మీందర్ సాహ్నీ వ్యాఖ్యానించారు. ఇక కొన్ని కంపెనీలు పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పేమెంట్ గేట్ వే సంస్థ పేయూ, తన 85 మంది ఉద్యోగుల కాల్ సెంటర్ విభాగాన్ని 25 మందికి కుదించింది. మాతృసంస్థ ఇండియా మార్ట్ లో విలీనమైన టొలెక్సో, 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ సీఈఓ బ్రిజేష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల తొలగింపుపై 'యప్ మీ' వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ స్పందిస్తూ, తాము పెట్టిన పెట్టుబడులు గత సంవత్సరంలోనే తిరిగి వస్తాయని ఆశించామని, కానీ నోట్ల రద్దు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయామని చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఇండియాలో అమ్మకాలు పడిపోయాయని, దీంతో విదేశాల్లో విస్తరణపై దృష్టిని సారించినందుకు ఇక్కడ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

More Telugu News