: ‘అమరావతి’ నిర్మాణంలో వేగం పెరగాలన్న బాబు.. రూ. 1000 కోట్ల బాండ్ల జారీకి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి తొలివిడతగా రూ.1000 కోట్ల విలువైన బాండ్ల జారీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి  నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అందజేసే రిటర్నబుల్ ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వెలగపూడి సచివాలయంలో ఏపీసీఆర్డీయే అధికారులతో జరిగిన సమావేశంలో  నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలన్నారు. ఇందులో భాగంగా వెయ్యికోట్ల రూపాయల బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ‘హడ్కో’ నుంచి రుణం విడుదల అవుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అమరావతిలో అడుగుపెట్టడం రాజధానికి దక్కిన తొలి విజయమని సీఎం అన్నారు. అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు విద్యాసంస్థల్లో కొన్నింటిని విశాఖపట్టణం, తిరుపతి తరలించడం ద్వారా ఈ మూడు నగరాలను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు వివరించారు.
 

More Telugu News