: చంద్రబాబును, ఏపీ పరిస్థితిని చూస్తుంటే బాధేస్తోంది: జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే తన మనసుకు బాధ కలుగుతోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్, అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

సొంత అవసరాలను తీర్చుకునేందుకు చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకి దిక్కూ మొక్కూ లేకుండా పోయిందని, పాలకులే నిబంధనలను అతిక్రమించడం బాధాకరమని అన్నారు. ఒక్కొక్కరికీ రూ. 20 కోట్లు ఇచ్చి మరీ చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ప్రత్యేక హోదా అడిగినా, కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరినా వారిని గృహ నిర్బంధం చేస్తున్నారని విమర్శించారు. తాను కాసేపట్లో విశాఖపట్నం బయలుదేరుతున్నట్టు తెలిపారు.

More Telugu News