: ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు: మరో సంచలన వీడియో పోస్ట్ చేసిన జవాన్
తమకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లేదని ఆరోపిస్తూ ఇటీవల ఓ బీఎస్ఎఫ్ జవాను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో అనంతరం సీఆర్పీఎఫ్ జవాను కూడా తమ బాధలను తెలుపుతూ మరో వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఇంటర్నెట్లో మరో వీడియో దర్శనం ఇచ్చింది. డెహ్రాడూన్లోని 42వ ఇన్ఫంట్రీ బ్రిగేడ్లో లాన్స్ నాయక్గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్ సింగ్ అనే సైనికుడు ఈ రోజు యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. కిందిస్థాయి జవాన్లను కొందరు అధికారులు ఉపయోగించుకుంటూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. తమతో షూ పాలిష్ కూడా చేయించుకుంటున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని తాను గతంలో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖల దృష్టికి తీసుకెళ్లడానికి లేఖలు రాశానని చెప్పిన యజ్ఙప్రతాప్ సింగ్.. దీనిపై పీఎంవో వివరణ కూడా అడిగిందని తెలిపారు. తాను తమ సమస్యలపై ఫిర్యాదు చేసే క్రమంలో ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, అయితే, అధికారులను పీఎంవో రిపోర్టు అడిగినప్పటినుంచి తనపై వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. తనను ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధమని, అందుకే తాను ఆ పని చేయడం లేదని చెప్పారు. ఈ విషయంపై సర్కారు ఇప్పటికైనా స్పందించాలని కోరారు.