: ఈ ఎన్నికలతో తొలిసారి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!

ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 మధ్య జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ పలు కీలక నిబంధనలను తొలిసారిగా అమలు చేయనుంది. వాటి వివరాలు...
* కవరేజ్ చార్జ్: ఎంతో మంది అభ్యర్థులు, పార్టీలకు సొంత టీవీ చానళ్లున్నాయి. వాటిల్లో ప్రసారమయ్యే అభ్యర్థులకు సంబంధించిన వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించి, ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు.
* ప్రభుత్వ బకాయిలు చెల్లించాల్సిందే: ఎవరైనా అభ్యర్థి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుంటే అభ్యర్థిత్వం రద్దవుతుంది. అన్ని రకాల బిల్లులనూ చెల్లించినట్టు సర్టిఫికెట్ ను అభ్యర్థి నామినేషన్ తో పాటే జత చేయాల్సి వుంటుంది.
* డిఫెన్స్, పారామిలిటరీ ఉద్యోగులకు ఈ దఫా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్లు వెళ్తాయి. విదేశాల్లో పనిచేస్తున్న సైనికులు, ఉద్యోగులు కూడా ఇదే విధానంలో ఓటేస్తారు.
* పోల్ అధికారుల వివరాలు, స్టేషన్ల సమాచారాన్ని స్థానిక భాషలోనే ముద్రించి అందుబాటులో ఉంచుతారు.
* ఓటింగ్ కంపార్టుమెంట్ ఎత్తు పెంపు: ప్రస్తుతం 24 అంగుళాలుగా ఉన్న ఓటింగ్ కంపార్టుమెంట్ ను మరింత సీక్రెసీ కోసం 30 అంగుళాలకు పెంచారు.
* స్టేషన్ కు వెళ్లేందుకు గూగుల్ సాయం: మీరు ఓటేయాల్సిన పోలింగ్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది? ఎలా వెళ్లాలన్న విషయమై గూగుల్ మ్యాప్ ను ఓటింగ్ స్లిప్ పై ముద్రిస్తారు.
* కుల, మత ప్రసక్తి వస్తే కఠిన చర్యలు: సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా, ఏ అభ్యర్థి ప్రచారంలోనైనా కులం లేదా మతం ప్రస్తావన వస్తే కేసులు నమోదు చేస్తారు.
* ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అభ్యర్థుల ఫోటోలను ముద్రించనున్నారు. మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఈ విధానం తొలిసారిగా అమల్లోకి రానుంది.

More Telugu News