: ఇది మన్మోహన్ యుగం కాదు... నియోజకవర్గాలకు వెళ్లి జనాల్లో చైతన్యం నింపండి: సొంత ఎంపీలకు క్లాస్ పీకిన అమిత్ షా

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీని అందరూ మెచ్చుకుంటున్నారని... కానీ బ్యాంకులు, ఏటీఎంలలో ఇప్పటికీ నగదు కొరత ఉండటంతో, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు బీజేపీ ఎంపీలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అమిత్ షాకు వారు విన్నవించారు. ఈ రోజు బీజేపీ ఎంపీలతో అమిత్ షా సమావేశమైన సందర్భంగా వారు ఈ అంశాన్ని షా ముందు ఉంచారు.

దీంతో సొంత ఎంపీలకు అమిత్ షా క్లాసు పీకారు. చిన్నచిన్న పనుల కోసం కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు కూర్చోవడానికి ఇది మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావుల యుగం కాదని చెప్పారు. ప్రభుత్వం వ్యవస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశంలో మార్పును తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వంలోని సీనియర్లు ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క బీజేపీ ఎంపీ కూడా తమ నియోజకవర్గాల్లో ఒక వారం గడపాలని... పెద్దనోట్ల రద్దుతో ఒనగూరే ప్రయోజనాలను జనాలకు వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. 

More Telugu News