: జయలలిత తాను చెప్పినట్టే చేశారు.. 'అమ్మ' అనిపించుకున్నారు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒక మాట అన్నారంటే అది జరగాల్సిందే. దానిని పూర్తి చేసేంతవరకు ఆమె పట్టువీడేవారు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఒక సందర్భంలో చెప్పిన మాటను తుచ తప్పకుండా జరగడం విశేషం. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యానని చెప్పారు. తన జీవితం తెరిచిన పుస్తకమని స్పష్టం చేశారు. ఎంజీఆర్‌ను ప్రతి ఒక్కరు ప్రేమించినట్టే తాను కూడా ప్రేమించానని అయితే, చట్టబద్ధమైన సంబంధానికి (పెళ్లికి) తాను అంగీకరించలేదని తెలిపారు. తనను తానుగా గుర్తించాలన్న కసి తనలో ఉండేదని ఆమె చెప్పారు. తన తల్లి బతికే ఉంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తన వ్యక్తిగత జీవితం మరోలా ఉండేదని తానెప్పుడు బాధపడుతుంటానని అన్నారు. తనకొచ్చిన గుర్తింపు కేవలం ఎంజీఆర్‌ వల్ల మాత్రమే వచ్చింది కాదని నిరూపించాలని అనుకున్నానని, అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని ఆమె చెప్పారు. వాస్తవానికి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయిగా పుట్టిన తరువాత కూతురిగా పెరిగి, భార్యగా కాపురం చేసి, తల్లిగా పరిపూర్ణత సాధించిన తరువాత మాత్రమే మరణించాలని... ఆ విధంగా తాను కూతుర్నయ్యానని, భార్య స్థానాన్ని పొందలేకపోయినా, అమ్మగా గుర్తింపును పొంది మాత్రం మరణిస్తానని అనేవారు. అమె అన్నట్టే తమిళనాట ప్రతి ఇంటా తల్లిగా మారి, ప్రతి ఇంటికీ ఏదోఒక రూపంలో సాయం చేసి, ప్రత్యర్థుల చేత కూడా తల్లి అనిపించుకున్న తరువాతే మరణించారు. దీంతో ఆమె జీవితం చరితార్థమైంది!

More Telugu News