: రూ. 5 వేల కోట్లడిగిన కేసీఆర్ సర్కారు... రూ. 25 కోట్లిచ్చిన కేంద్రం!

తీవ్రమైన చిల్లర కష్టాల్లో చిక్కుకుని పొద్దున లేస్తే, తిండి తిప్పల సంగతి ఆలోచించడం బదులు, ఏ ఏటీఎంలో డబ్బులు పెడతారోనని ఆరా తీస్తూ, గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుబడుతున్న ప్రజల అవస్థలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రజలకు అవసరమైన చిల్లరను అందించేందుకు రూ. 5 వేల కోట్ల విలువైన 100, 500 రూపాయల నోట్లను పంపాలని కేసీఆర్ ప్రభుత్వం గత వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయగా, ఆ లేఖను ఆర్బీఐ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటివరకూ కేవలం రూ. 25 కోట్ల కరెన్సీని మాత్రమే ఆర్బీఐ పంపింది. అంటే, అడిగిన మొత్తంతో పోలిస్తే, కేవలం 0.5 శాతం మాత్రమే పంపింది. ఇక తమకు డబ్బు రావడం లేదని ఆరోపిస్తున్న బ్యాంకర్లు, విత్ డ్రా కోసం వచ్చిన వారికి తాము ఎలాంటి నగదూ ఇవ్వలేమని స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఇప్పటివరకూ ప్రజల డిపాజిట్లు రూ. 35 వేల కోట్లకు పైగా దాటగా, ఇప్పటివరకూ రూ. 14 వేల కోట్ల కరెన్సీ కూడా రాలేదు. జమ చేసిన డబ్బుతో పోలిస్తే, 40 శాతం మాత్రమే నోట్లు రావడంతోనే ఇబ్బందులు కొనసాగుతున్నాయి.

More Telugu News