: రాష్ట్రానికి అత్యధిక లబ్ధి చేకూరాలంటే పార్లమెంట్ వేదికగా ఎంపీలు పోరాడాలి: సీఎం చంద్రబాబు

ఈ రోజు జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కి చట్టబద్ధతపై పార్లమెంట్ లో పట్టుబట్టాలని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీని రేపు కలిసి.. చట్టబద్ధతపై అడగాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కు నాబార్డు రుణం మంజూరుపై ప్రకటన రావాలని, వారం రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేలా చేయాలని, విశాఖ రైల్వే జోన్ అంశంపై సమావేశాల్లో పట్టుబట్టాలని, విదేశీ ప్రాయోజిత పథకాలకు కేంద్ర సాయంపై టీడీపీ గొంతు వినిపించాలని, రాష్ట్రానికి అత్యధిక లబ్ధిని రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలని, పార్లమెంట్ ను వేదికగా చేసుకుని పోరాడాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఎంపీలు అందరూ కలసి సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాతనోట్ల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ చాలామంచిదని, కానీ, ఆచరణలోనే కొన్ని ఇబ్బందులు వచ్చాయని అన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్, మొబైల్ బ్యాంకింగ్ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News