: బ్యాంకు ఉద్యోగులు స‌మ్మె చేస్తార‌న్న వ‌దంతులను నమ్మకండి!: కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి

బ్యాంకుల్లోకి న‌కిలీ నోట్లు రాకుండా టాస్క్‌ఫోర్స్ ప‌రిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత‌దాస్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఏటీఎంల‌లో వీలైనంత త్వ‌ర‌గా మార్పులు, చేర్పులు చేసి న‌గ‌దు అందుబాటులోకి తెస్తామని అన్నారు. బ్యాంకు ఉద్యోగులు స‌మ్మె చేస్తార‌న్న వ‌దంతులను నమ్మద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలకు అవ‌స‌ర‌మైన మేర‌కు న‌గ‌దు అందుబాటులోకి వ‌చ్చిందని తెలిపారు. గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రుల్లో, మెడిక‌ల్ షాపుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రద్దైన నోట్లను తీసుకోని తదుపరి వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని శ‌క్తికాంత‌దాస్ చెప్పారు. న‌గ‌దు మార్పిడి విషయంలో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బ్యాంకు ఖాతాదారుల‌కు ఇంకు గుర్తు పెట్టే ప్ర‌క్రియ నేటి నుంచే ప్రారంభం కానుందని చెప్పారు. ర‌ద్దీని త‌ట్టుకునేందుకు మైక్రో ఏటీఎంల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జన్ ధన్ ఖాతా విషయంలో ఖాతాదారుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న నగదును కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తోందని, అక్రమార్కులు వాటిల్లో డబ్బులు దాచుకోవాలనుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News