: మద్దెలచెరువు సూరి ఎవరో, మధుమోహన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు: డాన్ హెబ్బెట్టు మంజు

మద్దెలచెరువు సూరి అనుచరుడు మధుమోహన్ రెడ్డిని బట్టలు ఊడదీసి, కర్రలతో చితగ్గొట్టారు బెంగళూరు డాన్ హెబ్బెట్టు మంజు అనుచరులు. ఈ వీడియోను మీడియాకు అందించడంతో, అన్ని చానళ్లు దాన్ని ప్రసారం చేశాయి. ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో మంజు అనుచరులను బెదిరించాడని... అందుకే వారు మధుని చావగొట్టారని తెలుస్తోంది. అయితే, గ్యాంగ్ స్టర్ మంజు ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, టీవీలో వీడియోను చూశానని... అందులో ఉన్న దానికి, తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. తనపై గతంలో ఉన్న కేసులన్నీ క్లియర్ చేసుకుని, ఆరేళ్ల క్రితమే తాను బెంగళూరు వదిలి దుబాయ్ వచ్చేశానని... ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నానని తెలిపారు. తాను బెంగళూరులో దందా చేసే సమయంలో వందకు పైగా గ్యాంగులు ఉండేవని... వారిలో ఎవరైనా వీడియోలోని వ్యక్తిని కొట్టారేమో తనకు తెలియదని చెప్పారు. మద్దెలచెరువు సూరి కానీ, అతని అనుచరుడు మధుమోహన్ రెడ్డి కానీ తనకు తెలియదని మంజు స్పష్టం చేశారు. తన పేరును బద్నాం చేసేందుకే ఎవరో తన పేరుతో వీడియో విడుదల చేసినట్టు ఉన్నారని అభిప్రాయపడ్డారు. త్వరలోనే బెంగళూరు వస్తానని... అసలు ఏం జరిగిందో కనుక్కుంటానని చెప్పారు.

More Telugu News