: పర్యవేక్షణాలోపం వల్లే ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్: కోదండరాం

పర్యవేక్షణ లోపం కారణంగానే ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయిందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమైన పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలకు సరైన నాయకత్వం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహలను పెంచుతాయని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుందని, ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షల పట్ల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వేలాది విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించే ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ కావడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్ష రద్దయితే వారంతా గందరగోళంలో పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.