: వీడియో కవరేజ్ లేదని ఆగిన పెళ్లి.. మండపం నుంచి వెళ్లిపోయిన వధువు

పెళ్లి వారితో కల్యాణ మండపం కళకళలాడుతోంది. బంధువులతో సందడిగా ఉంది. పెళ్లి కొడుకు వధువు మెడలో తాళికట్టే సుముహూర్తం వచ్చేసింది. అందరూ ఆ శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. మెడ వంచి తాళి కట్టించుకోవాల్సిన వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. కారణం.. ఆ వేడుకలో వీడియో గ్రాఫర్ కనిపించకపోవడమే. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తురైయూర్‌లో జరిగిందీ సంఘటన. సెంథిల్(33)కు తన బంధువు తంగరసు కుమార్తె కోమాబాయ్‌‌తో ఆదివారం(జూన్ 26న) వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కోసం సెంథిల్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సమయం దగ్గర పడుతుండడంతో వధూవరులిద్దరూ మండపం చేరుకున్నారు. పురోహితుడు వేదమంత్రాలు ప్రారంభించాడు. అయితే ఈ వేడుకను ఒకే ఒక్క ఫొటోగ్రాఫర్ కవర్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన వధువు తండ్రి, ఇద్దరు కొడుకులు వీడియో గ్రాఫర్ ఎక్కడంటూ వరుడి తండ్రిని ప్రశ్నించారు. ఖర్చులకు వెనుకాడి వీడియోగ్రాఫర్‌ను పెట్టలేదని ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు అక్కడే గొడవకు దిగారు. అంతటితో ఆగక వధువును తీసుకుని కల్యాణమండపం నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి మండపం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ ఘటనపై వరుడు సెంథిల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News