: మళ్లీ ఎండల మంటలు.. తీరం దాటిన ‘రోను’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను ప్రభావంతో కొద్దిగా చల్లబడినా, ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ వైపు ప్రయాణించిన తుపాను శనివారం సాయంత్రమే చిట్టగాంగ్ వద్ద తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతూ చైనా వైపు ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తుపాను దూరంగా వెళ్లిపోయినా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి గాలుల తీవ్రత కొంత వరకూ కొనసాగుతున్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.