: మిగిలింది 7 నెలల 23 రోజులేగా.. దీక్ష విరమించండి: ముద్రగడకు మంత్రి నారాయణ విజ్ఞప్తి


కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఏపీ మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం ఓ విజ్ఞప్తి చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని చెప్పిన నారాయణ, తక్షణమే దీక్ష విరమించాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం సుదీర్ఘ వివరణతో కూడిన విజ్ఞప్తి చేశారు. ‘‘కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఏటా వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని మేం చెప్పాం. మా హామీలకు మేం కట్టుబడి ఉన్నాం. కాపులకు న్యాయం చేయడానికి, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్ ను నెల క్రితమే ఏర్పాటు చేశాం. కమిషన్ కాల పరిమితిని 9 నెలలుగా నిర్ణయించాం. ఇప్పటికే ఒక నెల 7 రోజుల సమయం గడిచిపోయింది. మరో 7 నెలల 23 రోజుల్లో కమిషన్ నివేదిక రానుంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు ఆ మాత్రం సమయం అవసరమే. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి దయచేసి దీక్ష విరమించండి’’ అని ముద్రగడకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News