: టైగర్ మెమన్ ను కలిశా... కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ ను కలిశానంటూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మాజిద్ నిన్న సంచలన ప్రకటన చేశారు. యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష నేపథ్యంలో మాజిద్ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2002కు ముందు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న మాజిద్ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు. అనంతరం 2002లో ఉత్తర కాశ్మీర్ లోని బాండిపురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థికిగా బరిలోకి దిగి విజయం సాధించారు. నాటి ముఫ్తీ మహ్మద్ సయీద్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మాజిద్, గతేడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష నేపథ్యంలో నిన్న మాజిద్ మీడియాతో మాట్లాడుతూ 1993లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే టైగర్ మెమన్ ను రెండు, మూడు సార్లు కలిశానని చెప్పుకొచ్చారు. ‘‘టైగర్ మెమన్ కు నేనేమీ స్నేహితుడిని కాను. అతడే మా కార్యాలయానికి వచ్చి కలిసేవాడు. యాకూబ్ అరెస్ట్ పై టైగర్ చాలా బాధపడేవాడు. అప్పటికే ముంబై పేలుళ్లు జరిగిపోయాయి. టైగర్ భారత మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి ఎక్కాడు. ఎందుకు? ఎలా? చేశావని టైగర్ ను అడిగాను. పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారంతోనే ముంబై పేలుళ్లకు పాల్పడ్డానని టైగర్ చెప్పాడు’’ అని మాజిద్ చెప్పారు.

More Telugu News