: ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ... 8.8 కోట్ల సభ్యత్వం నమోదు

గడచిన ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారతీయ జనతా పార్టీ, తాజాగా ఏ ఒక్క భారత రాజకీయ పార్టీకి దక్కని అరుదైన ఘనతను సాధించింది. 8.8 కోట్ల మంది సభ్యులతో ఆ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 8.6 కోట్ల మంది సభ్యులతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇప్పటిదాకా అతిపెద్ద పార్టీగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ పార్టీ రికార్డును బీజేపీ తాజాగా చెరిపేసింది. ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. నిన్నటితో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 8.8 కోట్లు దాటింది. ఇటీవలే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా దిశానిర్దేశంతో పార్టీ నేతలు సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచారు. మరికొంత కాలం పాటు కొనసాగనున్న సభ్యత్వ నమోదులో మొత్తం 10 కోట్ల మంది సభ్యులను చేర్చాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇదే జరిగితే, సమీప భవిష్యత్తులో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశమే ఉండదని ఆ పార్టీ వర్గాలు గర్వంగా చెబుతున్నాయి.

More Telugu News