: ‘తెలంగాణ బిల్లుకు ట్విస్టులే ట్విస్టులు’: ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పతాక శీర్షిక
తెలంగాణ ముసాయిదా బిల్లుకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. తెలంగాణ అంశానికి సంబంధించి మొత్తం వ్యవహారంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ భారీ కథనాన్ని రాసింది. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి కొత్త కొర్రీలు ముందున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరమవుతుందేమోనన్న సందేహాన్ని లోక్ సభ సచివాలయం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో సలహా ఇవ్వాలని న్యాయ మంత్రిత్వశాఖను కోరింది. తెలంగాణలో ‘శాసనమండలి’ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని అటార్నీ జనరల్ గులాం వాహనవతి ఇంతకు ముందే ప్రభుత్వానికి సూచించారు. అయితే, మంత్రుల బృందం ఆ సలహాను పక్కన పెట్టి.. సాధారణ పునర్విభజన బిల్లుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది.
మరోవైపు బిల్లు సాఫీగా ఆమోదం పొందేలా చూసేందుకు సహకరించాలని స్పీకర్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్ నాథ్ కోరారు. ఈరోజు (బుధవారం) ఆయన సుమారు గంట సేపు స్పీకర్ తో చర్చలు జరిపారు. బిల్లును వ్యతిరేకించే సభ్యుల్ని అవసరమైతే తన విచక్షణాధికారం ఉపయోగించి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనల్ని సైతం సడలించాలని స్పీకర్ ను కోరినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో ఉంది. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలనే విజ్ఞప్తి వస్తే దానికి అంగీకరించవద్దని కూడా కమల్ నాథ్ అన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్ గా బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు వ్యవహరిస్తున్న విషయం విదితమే.