madras: మతం మారిన తర్వాత ఇక కులం కొనసాగదు!: మద్రాసు హైకోర్టు

  • మతం మారిన వాళ్లకు రిజర్వేషన్లు వర్తించే విషయం సుప్రీంకోర్టు తేలుస్తుందని వ్యాఖ్య
  • ఇస్లాం స్వీకరించిన తర్వాత పుట్టిన కులం రిజర్వేషన్ కోరుతూ ఉద్యోగార్థి పిటిషన్
  • ఈ విషయంలో తాము కల్పించుకోలేమని వ్యాఖ్యానించిన హైకోర్టు న్యాయమూర్తి
Can not carry original caste to converted religion says Madras HC

ఇస్లాం స్వీకరించిన హిందువు వెనుకబడిన తరగతి (బీసీ) అభ్యర్థిగా రిజర్వేషన్ ప్రయోజనాలను డిమాండ్ చేయగలరా? ఈ ప్రశ్నకు మద్రాసు హైకోర్టు ప్రతికూల సమాధానం ఇచ్చింది. ఒక వ్యక్తి మతం మారిన తర్వాత ఇకపై అతను పుట్టిన కులం అతనికి వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సివుందని పేర్కొంది. 

నిమ్న వర్గానికి చెందిన కులంలో హిందువుగా జన్మించిన అక్బర్ అలీ పిటిషన్‌పై జస్టిస్ జి ఆర్ స్వామినాథన్ ఈ తీర్పును వెలువరించారు, అక్బర్ అలీ అత్యంత వెనుకబడిన తరగతి (ఎంబిసి) కేటగిరీ కిందకు రాలేడని చెప్పారు. అక్బర్ అలీ  2008లో ఇస్లాం మతంలోకి మారి తన పేరు మార్చుకున్నాడు. అతను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. 

అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కాకుండా ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించబడినందున అతను ఉద్యోగానికి ఎంపిక అవ్వలేదు. ఈ విషయంలో తనను మినహాయించాలని కోరుతూ అక్బర్ కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ స్వామినాథన్ అతని అభ్యర్థనను తోసిపుచ్చారు. ‘మతాన్ని మార్చుకున్నతర్వాత కూడా ఆ వ్యక్తికి రిజర్వేషన్ల ప్రయోజనం ఇవ్వాలా? వద్దా? అనేది అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్న. ఈ విషయం సుప్రీంకోర్టు అధీనంలో ఉన్నందున ఈ కోర్టు ఎలాంటి తీర్పునివ్వదు. పిటిషనర్ విషయంలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న వైఖరి సరైనది. దీనిలో కోర్టు ఎటువంటి జోక్యాన్ని కోరుకోదు’ అని స్పష్టం చేశారు.

More Telugu News