Maharashtra: ఇటువంటి సమయంలో మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకకు రావడం సరికాదు: సీఎం బసవరాజ్ బొమ్మై

  • కర్ణాటక-మహారాష్ట్ర మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం
  • బెళగావిలోని మహారాష్ట్ర అనుకూల వాదులను కలిసేందుకు వస్తున్న ‘మహా’ మంత్రులు
  • వస్తే ఆందోళన తప్పదని హెచ్చరించిన కర్ణాటక అనుకూల వాదులు
  • గత ప్రభుత్వాలు ఏం చేశాయో తామూ అదే చేస్తామన్న బొమ్మై 
Maha ministers visiting Belagavi at this juncture inappropriate says Bommai

సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్న వేళ మహారాష్ట్ర మంత్రులు బెళగావిని సందర్శించడం సరికాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పామన్నారు. మహారాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిషేధిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. ఇలాంటి సమయాల్లో గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తాము కూడా అదే పాటిస్తామన్నారు. 

మహారాష్ట్రలో కన్నడ మాట్లాడేవారి సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం జత్ తాలూకా, పరిసర ప్రాంతాల్లో నీటి పారుదల ప్రాజెక్టు కోసం రూ. 2 వేల కోట్లు ప్రకటించిందని బొమ్మై అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ కన్నడ మాట్లాడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

కర్ణాటక-మహారాష్ట్ర మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాంపై నేడు బెళగావిలోని మహారాష్ట్ర అనుకూల కార్యకర్తలను కలిసేందుకు మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్‌లు వస్తున్నారు. అయితే, వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తే ఆందోళన తప్పదని కర్ణాటక అనుకూల సంస్థలు బుధవారం హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News