Andhra Pradesh: 2018లోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా, ఎందుకు పూర్తిచేయలేదు?: మంత్రి అంబటి రాంబాబు

  • పోలవరం వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదన్న అంబటి
  • కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం తప్పిదం కాదా? అని ప్రశ్న
  • పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదంటూ ఎద్దేవా
ap minister ambati rambabu responds on chandrababu agitation at polavaram project

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా పోలవరం ప్రాజెక్టు ముఖద్వారం ముందే చంద్రబాబు నడిరోడ్డుపై బైఠాయించడం, ఆపై వైసీపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించడంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరం వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదన్న అంబటి... ఈ కారణంగానే చంద్రబాబుకు ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు అంబటి ఘాటుగా స్పందించారు. 

గతంలో తనకు డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో తెలియదని చంద్రబాబు అన్నారన్న అంబటి... ఆ విషయం తనకు తెలుసో, లేదో ప్రజలు, అధికారులకు తెలుసునని అన్నారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం తప్పిదం కాదా? అని ప్రశ్నించిన అంబటి.. పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు. పోలవరం ఖర్చు కేంద్రం భరించాలని చట్టంలో ఉందని టీడీపీ నేతలే చెప్పారని, మరి కేంద్రం భరించాలని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నెత్తిన వేసుకుంది? అని మంత్రి ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళతామని చంద్రబాబు చెప్పారు కదా? అని అన్న అంబటి... ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

More Telugu News