Team New Zealand: నేడు భారత్–న్యూజిలాండ్‌ రెండో టీ20.. వరుణుడు ఆడనిస్తాడా?

  • ఈ మ్యాచ్‌కూ వాన ముప్పు
  • ఇప్పటికే వర్షంతో తొలి మ్యాచ్ రద్దు
  • మ. 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం 
Will rain play spoilsport in 2nd T20I

భారత్–న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌లో తొలి టీ20 వర్షం వల్ల టాస్‌ కూడా పడకుండానే రద్దవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కాస్త రెండు టీ20ల పోరుగా మారింది. ఇప్పుడు వేదిక మౌంట్‌ మాంగనుయ్ కి మారినా పరిస్థితి మారేలా లేదు. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టీ20కి కూడా వాన ముప్పు పొంచి ఉంది. మౌంట్ మాంగనుయ్ లో మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.  

హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని భారత్ ఈ సిరీస్ లో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించాలని చూస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కివీస్‌ గడ్డపై అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన సత్తాచాటుకొని ఈ ఫార్మాట్‌లో జట్టులో చోటు నిలుపుకోవాలని చూస్తున్నాడు. భారత్ మాదిరిగా న్యూజిలాండ్ కూడా టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌ ఓటమి బాధను మరిచి తిరిగి గాడిలో పడాలని ఆశిస్తోంది. మరి, వరుణుడు కరుణించి మ్యాచ్‌ సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.

More Telugu News