Pawan Kalyan: మోదీతో భేటీ కోసం విశాఖ చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్

  • కాసేపట్లో ప్రధాని మోదీ విశాఖ రాక
  • మోదీతో భేటీ కోసం నగరానికి విచ్చేసిన పవన్
  • రాత్రి 8.30 గంటలకు మోదీతో సమావేశం
  • వివిధ అంశాలపై చర్చించే అవకాశం
Pawan Kalyan arrives Vizag

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖ వస్తున్న నేపథ్యంలో, ఆయనతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పవన్ తన వాహనంలో నేరుగా నోవోటెల్ హోటల్ కు పయనమయ్యారు.

పవన్ ఈ రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ అపాయింట్ మెంట్ ను ఖరారు చేస్తూ పవన్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టెలిఫోన్ ద్వారా సమాచారం అందింది. నేటి సాయంత్రం నుంచి విశాఖలో అందుబాటులో ఉండాలని ఆ సమాచారం సారాంశం. 

కాగా, ప్రధాని మోదీతో భేటీ కోసం పవన్ వివిధ అంశాలపై కసరత్తులు చేసి ఐదు పేజీల నోట్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రధానంగా, ఏపీలో బీజేపీతో పొత్తుపై పవన్ మరింత స్పష్టత కోరతారని భావిస్తున్నారు. ఈ దిశగా రోడ్ మ్యాప్ ను అడిగే అవకాశాలున్నాయి. 

ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ వ్యతిరేక ఓటును టీడీపీకి వెళ్లనివ్వబోమని చెబుతున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న విషయం అర్థమవుతోంది.

More Telugu News