Telangana: చివరి దాకా హోరాహోరీ తప్పకపోవచ్చు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • రౌండ్ రౌండ్ కూ ఫలితాలు మారుతున్నాయన్న రాజగోపాల్ రెడ్డి
  • అయినా చివరకు బీజేపీనే విజయం సాధిస్తుందని వెల్లడి
  • నాలుగో రౌండ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి
komatireddy rajgopal reddy says bjp will wins munugode bypoll

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపులో చివరి రౌండ్ ముగిసేదాకా విజయమెవరిదో చెప్పడం కష్టమన్న రీతిలో మాట్లాడిన ఆయన చివరి దాకా హోరాహోరీ తప్పదేమోనని వ్యాఖ్యానించారు. రౌండ్ రౌండ్ కూ ఫలితాలు మారుతున్నాయని చెప్పిన రాజగోపాల్ రెడ్డి... చివరి రౌండ్ దాకా హోరాహోరీ తప్పదని పేర్కొన్నారు. అయితే చౌటుప్పల్ మండలంలో తాను ఊహించినట్లుగా బీజేపీకి మెజారిటీ రాలేదని ఆయన అన్నారు. 

అయితే చివరకు బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి... నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి చౌటుప్పల్ మండలం బీజేపీకే కాకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టున్న మండలం. ఇలాంటి మండలంలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించడం రాజగోపాల్ రెడ్డిని విస్మయానికి గురి చేసిందన్న భావన వ్యక్తమవుతోంది.

More Telugu News