Wipro: మూన్ లైటింగ్‌కు పాల్ప‌డ్డ వారిని విప్రో ఇలా క‌నిపెట్టింది!.. ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన ఇన్వెస్ట‌ర్‌!

  • మూన్ లైట‌ర్ల‌ను క‌నిపెట్టిన వైనంపై ఇన్వెస్ట‌ర్ రాజీవ్ మెహ‌తా ట్వీట్‌
  • ఒక‌టి కంటే ఎక్కువ సంస్థ‌ల నుంచి పీఎఫ్ జ‌మ అవుతున్న‌ట్లు గుర్తించిన‌ భ‌విష్య నిధి సంస్థ
  • ఆ వివ‌రాల‌ను కంపెనీల‌కు అందించిన వైనం
  • భ‌విష్య నిధి సంస్థ వివ‌రాల‌తోనే మూన్ లైట‌ర్ల‌ను గుర్తించిన విప్రో
a tweet of invester rajiv mehta how wipro identifies moon lighters gors viral

మూన్ లైటింగ్.. ఐటీ కంపెనీల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న ఈ అంశం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఒక కంపెనీలో ఉద్యోగిగా ప‌నిచేస్తూ అద‌న‌పు ఆదాయం కోసం తాను ప‌నిచేస్తున్న కంపెనీ క‌ళ్లుగ‌ప్పి ఇంకో కంపెనీకి ఉద్యోగులు ప‌నిచేస్తున్న విధానాన్నే మూన్ లైటింగ్‌గా పిలుస్తున్నాం. ఈ త‌ర‌హా విధానాన్ని పాటిస్తే వేటు త‌ప్ప‌దంటూ ఉద్యోగుల‌కు ఐటీ కంపెనీలు హెచ్చ‌రిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా మూన్ లైటింగ్‌కు పాల్ప‌డుతున్న 300 మంది ఉద్యోగుల‌పై వేటు వేస్తూ భార‌త ఐటీ దిగ్గ‌జం విప్రో ఇటీవ‌లే చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... వ‌ర్క్ ఫ్రం హోం ప‌ద్ద‌తిన పనిచేస్తున్న ఉద్యోగులు మాత్ర‌మే మూన్ లైటింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంది. ఇంటి వ‌ద్ద ప‌నిచేస్తున్న త‌మ ఉద్యోగులు త‌మ‌కు తెలియ‌కుండా ఇత‌ర‌త్రా కంపెనీలకు ప‌నిచేస్తున్న విష‌యాన్ని విప్రో ఎలా క‌నిపెట్టింద‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దినీ తొలుస్తోంది. తాజాగా మూన్ లైట‌ర్ల‌ను విప్రో ఇలా క‌నిపిపెట్టిందంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట‌ర్ రాజీవ్ మెహ‌తా ఓ ట్వీట్‌లో స‌వివ‌రంగా వెల్ల‌డించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రాజీవ్ మెహ‌తా ట్వీట్ ప్ర‌కారం మూన్ లైట‌ర్ల‌ను విప్రో చాలా సుల‌భంగానే క‌నిపెట్టింది. అదెలాగ‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌తి ఉద్యోగికి ఆయా కంపెనీలు నెల‌వారీగా ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌)ను జ‌మ చేస్తూ ఉండాలి క‌దా. ఇందుకోసం భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వ‌ద్ద ఉద్యోగుల‌కు సంబంధించిన ఆధార్‌, పాన్ కార్డుల‌ను ఆయా సంస్థ‌లు న‌మోదు చేస్తాయి. త‌మ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన ఉద్యోగుల ఖాతాల్లో ఆయా సంస్థ‌లు పీఎఫ్‌ను జ‌మ చేస్తున్నాయా?, లేదా? అన్న అంశాన్ని భ‌విష్య నిధి సంస్థ క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తూ ఉంటుంది. 

ఇలా ప‌రిశీల‌న జ‌రుగుతున్న స‌మ‌యంలో కొంద‌రు ఉద్యోగుల ఖాతాల్లో నెల‌కు ఒక‌టి కంటే ఎక్కువ సంస్థ‌ల నుంచి పీఎఫ్ జ‌మ అవుతున్న‌ట్లు గుర్తించింది. ఆ త‌ర‌హా ఉద్యోగులు ప‌నిచేస్తున్న కంపెనీల‌కు భ‌విష్య నిధి సంస్థ అందజేసింది. ఇలా భ‌విష్య నిధి సంస్థ నుంచి అందిన వివ‌రాల‌తోనే విప్రో త‌మ ఉద్యోగులు మూన్ లైటింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని నిర్ధారించుకుని వారిపై వేటు వేసింది. అయితే మూన్ లైట‌ర్ల వివ‌రాల‌ను ఆయా సంస్థ‌ల‌కు అంద‌జేసిన విష‌యంపై ఇప్ప‌టిదాకా భ‌విష్య నిధి సంస్థ స్పందించ‌లేదు.

More Telugu News