Narendra Modi: ఐసీయూలో ఉన్న‌ ములాయం సింగ్ ఆరోగ్యంపై వాక‌బు చేసిన ప్ర‌ధాని మోదీ

  • ఆయ‌న త‌న‌యుడు అఖిలేష్  యాద‌వ్‌కు ఫోన్ చేసి ఆరా తీసిన ప్ర‌ధాని
  • ఏదైనా సాయం కావాలంటే చేసేందుకు సిద్ధ‌మ‌ని భ‌రోసా
  • అఖిలేష్‌తో మాట్లాడిన యూపీ సీఎం యోగి, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ 
PM Modi enquires about Mulayam Singh Yadavs health

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆరా తీశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూ చికిత్స పొందుతున్న ములాయం గురించి ఆయ‌న త‌న‌యుడు అఖిలేష్ యాదవ్‌తో మోదీ మాట్లాడారు. ఏదైనా సహాయం అవ‌స‌రం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నానని అఖిలేష్‌కు మోదీ భ‌రోసా ఇచ్చారు. ఆరోగ్యం క్షీణించి తొలుత ప్రైవేట్ వార్డులో చేరిన ములాయం ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో వెంటనే ఐసీయూ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

కాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. ఆయ‌న‌కు అత్యుత్త‌మ చికిత్స అందించాల‌ని ఆసుపత్రి వైద్యుల‌కు సూచించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర రక్షణ శాఖ‌ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన తండ్రి ఆరోగ్యంపై ఆరా తీశారు. "ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యం గురించి సమాచారం తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న‌ కుమారుడు అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ములాయం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయ‌న త్వరగా కోలుకోవాల‌ని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ ట్విట్టర్‌లో ఆదివారం రాత్రి తెలియజేసింది.

More Telugu News