Gujarat: గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే

  • డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
  • వరుసగా ఏడోసారి కూడా బీజేపీదే విజయమన్న ఒపీనియన్ పోల్
  • ఎన్నికల్లో ఆప్ ప్రభావం ఉంటుందని తేల్చిన వైనం
  • కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 44 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా
  • బీజేపీకి మాత్రం 143 స్థానాలు వస్తాయంటున్న ఒపీనియన్ పోల్
ABP News CVoter Survey Says BJP Likely To Return To Power In Himachal Pradesh and Gujarat

ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి ‘ఆప్’ సామ్రాజ్యాన్ని విస్తరించాలని యోచిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇది చేదు వార్తే. గుజరాత్‌లో ఆప్ ఎంత పోరాడినా దానికి దక్కేది రెండు సీట్లు మాత్రమేనని ఏబీపీ న్యూస్-సీఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అయితే, గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రభావం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడుతుందని, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీలకు తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆప్‌కు మాత్రం 17.4 శాతం వరకు ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది.

గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఈసారి 135 నుంచి 143 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్న ఒపీనియన్ పోల్.. ఆప్‌కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉండగా అందులో బీజేపీకి 37 నుంచి 45 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

More Telugu News