BJP: అమరావతి రైతుల పాదయాత్రపై దాడి చేస్తే.. బీజేపీ గట్టిగా ఎదుర్కొంటుంది: సత్యకుమార్

  • అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెపుతున్నారు
  • ఇంత పేర్ల పిచ్చి ఉన్న పార్టీని నేను ఎప్పుడూ చూడలేదు
  • అభివృద్ధి అంటే పేర్లు మార్చడం కాదు
BJP Satya Kumar fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్నీ అబద్ధాలే చెపుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ పేరును మార్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇంత ఎక్కువగా పేర్ల పిచ్చి ఉన్న పార్టీని తాను ఇంత వరకు చూడలేదని... ఆయన పేరో, వాళ్ల నాన్న పేరో పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే పేర్లు మార్చడం కాదని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం అవుతోందని... అందుకే కొత్త నాటకానికి తెర లేపారని అన్నారు. 

అమరావతి రైతులను బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతుందని... పాదయాత్ర సందర్భంగా రైతులపై దాడి జరిగితే... బీజేపీ గట్టిగా ఎదుర్కొంటుందని చెప్పారు. మూడున్నరేళ్లలో ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని... పైగా, జూట్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించారని విమర్శించారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News