Maha Padayatra: రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడ శరత్ టాకీస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

  • అరసవల్లికి అమరావతి రైతుల పాదయాత్ర
  • గుడివాడ చేరుకున్న పాదయాత్ర
  • శరత్ టాకీస్ వద్ద జై అమరావతి నినాదాలు
  • వ్యతిరేక నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు
Little tense moments at Gudivada Sarath Talkies

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గుడివాడ పట్టణంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, గుడివాడ శరత్ టాకీస్ సెంటర్ లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

పాదయాత్ర శరత్ టాకీస్ సెంటర్ వద్దకు చేరుకోగానే రైతులు "జై అమరావతి" అంటూ నినాదాలు చేశారు. శరత్ టాకీస్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలు రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఓ దశలో మాజీ ఎంపీ మాగంటి బాబు వైసీపీ వర్గీయులకు చెప్పు చూపించడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు మాగంటి బాబును నెట్టివేసినట్టు తెలుస్తోంది. 

రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడ పట్టణం పోలీసుల వలయంలో ఉంది. పలువురు డీఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాగా, ఏలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సినీ ఫక్కీలో గుడివాడ చేరుకున్నారు. ఆయనపై ఉదయం నుంచి పోలీసు నిఘా ఉంది. అయితే తన ఇంటివద్ద మోహరించిన పోలీసులను తప్పించుకుని ఆయన బైక్ పై గుడివాడ వచ్చారు. చింతమనేనిని చూడగానే అమరావతి రైతుల్లో ఆనందం ఉప్పొంగింది.

More Telugu News