Team India: టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి: ఐసీసీ

  • ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • అక్టోబరు 23న దాయాదుల మ్యాచ్
  • సూపర్-12 దశలో తలపడనున్న భారత్, పాక్ జట్లు
  • అదనపు టికెట్లు కూడా అయిపోయిన వైనం
ICC says India and Pakistan match tickets sold out

ఇటీవల ఆసియాకప్ లో రెండుసార్లు తలపడి క్రికెట్ అభిమానులకు విశేషమైన వినోదాన్ని అందించిన దాయాదులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబరు 23న ఈ కీలక సమరం జరగనుంది. 

కాగా, ఈ మ్యాచ్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన టికెట్లు కొద్ది సమయంలోనే అమ్ముడయ్యాయని ఐసీసీ వెల్లడించింది. అదనపు టికెట్లను తీసుకువచ్చినా, అవి కూడా కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయని తెలిపింది. 

టోర్నీ ప్రారంభానికి ముందు టికెట్ల రీసేల్ కోసం ఓ అధికారిక వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని, అభిమానులు టికెట్లను వాటి ముఖ విలువ వద్దే మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఐసీసీ వివరించింది. 

ఇక టోర్నీలో అన్ని మ్యాచ్ లకు కలిపి 5 లక్షలకు పైగా టికెట్లను విక్రయించినట్టు వెల్లడించింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సూపర్-12 దశ ప్రారంభ మ్యాచ్ కు మాత్రం కొన్ని టికెట్లు మిగిలున్నాయని తెలిపింది. 

ఆస్ట్రేలియాలో జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16న ప్రారంభం కానుంది. నవంబరు 13న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది.

More Telugu News